ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో పోలీస్ నియామకాలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. వెంటనే పోలీస్ నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు సైతం అత్యంత పారదర్శకంగా ఉండాలని సూచించారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నియామకాల ప్రక్రియలో ఉన్న లోటుపాట్లను అధిగమించే అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడి నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై నివేదిక కోరారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు హోంగార్డుల సేవలు వినియోగించుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి అదే శాఖలో ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆమెకు ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. ధర్నాచౌక్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.