ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించవద్దని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలీస్ అధికారులతో కలిసి ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను, ఎన్టీఆర్ స్టేడియంను సందర్శించారు. ధర్నా చౌక్ పరిసరాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేదని, కొత్తగా నిర్మించిన స్టీల్ బిట్స్ కారణంగా ఆ సమస్య కొంత మేర తీరిందన్నారు.
శాంతియుతంగా ధర్నాలు చేస్తే ఇబ్బంది లేదని, పబ్లిక్ కు ఇబ్బంది కలగకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం శాంతి నిరసనలు చేస్తే వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధర్నా చౌక్ పై ఇప్పటికే హై కోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తామన్నారు.