IND w Vs ENG w : ఇంగ్లాండ్-ఇండియా మధ్య ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఏకైక వుమెన్స్ టెస్ట్ మ్యాచ్ లో ప్రపంచ రికార్డు నమోదైంది. తొలి రోజు ఆటలో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల టెస్ట్ క్రికెట్లో 88 ఏళ్ల తర్వాత తొలి రోజు 410 రన్స్ చేసిన తొలి జట్టుగా నిలిచింది.
అంతేకాదు ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమ్ ఇండియా తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన రెండో జట్టుగా నిలిచి రికార్డుకెక్కింది. అంతకుముందు ఎప్పుడో 1935లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసి ఈ ఘనత సాధించింది.
రెండోరోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికి ముందురోజు స్కోరు 410కి మరో 18 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది. అనంతరం ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి 136 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (5/7) మాయాజాలానికి ఇంగ్లాండ్ విలవిల్లాడింది. అలా టీమిండియా 292 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
వివరాల్లోకి వెళితే తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియాలో దీప్తి శర్మ (67), యస్తికా భాటియా (66). సతీశ్ శుభా (69), జెమిమా రోడ్రిగ్స్ (68) అర్ధ శతకాలు సాధించారు. అందరూ రికార్డ్ స్థాయిలో పరుగులు సాధించినా ఏదో బొట్టు పెట్టినట్టు 66 దగ్గర నుంచే అయిపోవడం విచిత్రంగా ఉందని అంటున్నారు. ఇక కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 49 పరుగుల వద్ద రనౌటైంది. స్మృతి మంధాన (17) , స్నేహ రాణా (30), షెఫాలీ వర్మ (19) పరుగులు తమ వంతు సహకారం అందించారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ 3, లారెన్ బెల్ 3, చార్లీ డీన్ 1, కేట్ క్రాస్ 1, నాట్ సివర్ 1 వికెట్లు తీశారు.
తర్వాత ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఏ దశలోనూ క్రీజులో నిలదొక్కుకోలేక పోయింది. కళ్ల ముందు భారీ స్కోరు కనిపించడంతో తడబడి బ్యాటర్లు వడివడిగా వికెట్లు సమర్పించుకున్నారు.
ఓపెనర్ డుంక్లీ (11), కెప్టెన్ హీథర్ (11) త్వరగా అవుట్ అయ్యారు. తర్వాత పూజ మెరుపు ఫీల్డింగ్తో బ్యూమాంట్ రనౌటైంది. ఇక నాట్ సివర్ (59) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కానీ ఎవరూ సహకరించేవారు లేకపోవడంతో తనది ఒంటరి పోరాటమే అయ్యింది.
దీప్తి శర్మ స్పిన్ ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఏడు పరుగులిచ్చిన దీప్తి 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ నడ్డి విరగ్గొట్టింది. ఇక 10 పరుగుల వ్యవధిలో ఆఖరి ఆరు వికెట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది. భారత బౌలర్లలో దీప్తి 5 వికెట్లు, స్నేహ 2, పూజ, రేణుక చెరో వికెట్ తీశారు.