T20 World Cup 2024 : వన్డే వరల్డ్ కప్ 2023 అయిపోయింది. ఆ సంబరం, సరదా, సంతోషం, విషాదం, దుఖం అన్నింటినీ కలిపి అభిమానులు పంచుకున్నారు. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతున్నారు. ఈ సమయంలో 2024 జూన్ లో పొట్టి వరల్డ్ కప్ మ్యాచ్ విశేషాలు రొజుకొకటి హల్చల్ చేస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా సమాచారం అందనప్పటికి ఇండియా-పాక్ మధ్య జరిగే టీ 20 ప్రపంచ కప్ మ్యాచ్ వేదిక ఖరాదైందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు స్పీడుగా షికారు కొడుతున్నాయి.
ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ అంటే ఎలా ఉంటుంది. రెండు నిప్పు కోళ్ల మధ్య వార్ లాగే ఉంటుంది. అలాంటిదిప్పుడు టీ 20 ప్రపంచ కప్ లో పాక్-ఇండియా మధ్య జరిగే గ్రూప్ మ్యాచ్ న్యూయార్క్ లో జరగనుందని సమాచారం. ఈ ఐసీసీ మెగా టోర్నమెంట్ ని అమెరికా-వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
అమెరికాలో మూడు వేదికల్లో మ్యాచ్లు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్ లో జరిగే అవకాశాలున్నాయి. అయితే భారత్-పాక్ మధ్య జరిగే గ్రూప్ మ్యాచ్ న్యూయార్క్లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ స్టేడియం కెపాసిటీ సుమారు 35 వేలు అని చెబుతున్నారు. ఇక్కడ దాదాపు ఏడు లక్షల మంది పైనే భారతీయులు, ఆ మూలాలు ఉన్నవారు నివసిస్తున్నారు. పాకిస్తాన్ కి చెందిన వారు మాత్రం లక్ష పైనే ఉన్నారని అంటున్నారు.
అప్పుడే ఈ మ్యాచ్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాకిస్తాన్ ఈసారైనా ఇండియాపై గెలుస్తుందా? అనే పందాలు భారీగా జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇకపోతే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ను మాత్రం కరేబియన్ దీవుల్లోని బార్బడోస్లో నిర్వహించాలని భావిస్తున్నారు. 2007 వన్డే ప్రపంచకప్, 2010 టీ20 కప్ ఫైనల్స్ బార్బడోస్లోనే జరగడం విశేషం.
ఈసారి టీ 20 ప్రపంచకప్ టోర్నమెంటులో ఎక్కువ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. మెగా టోర్నమెంటులో పాల్గొనేందుకు ఐసీసీకి ఎన్నో దేశాలు అప్పీలు చేసుకున్నాయి. నిబంధనల మేరకు చాలా దేశాల మధ్య క్వాలిఫయింగ్ మ్యాచ్ లు నిర్వహించింది.
అలా 20 జట్లు క్వాలిఫై కావడంతో వీటిని 4 గ్రూప్ లు గా విభజించింది. ఒకొక్క దాంట్లో ఐదేసి జట్లు ఉంటాయి. వీటిలో ఒక జట్టు మిగిలిన నాలుగు జట్లతో ఆడుతుంది. అలా చివరికి టాప్ రెండు టీమ్ లు సూపర్-8 రౌండ్ కి చేరుతాయి. అందులోంచి నాలుగు బయటకు వచ్చి సెమీస్ కి వెళతాయి. అక్కడ నుంచి రెండు ఫైనల్ కి వెళతాయి.