Munugode by poll : మునుగోడు సంగ్రామం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమాప్తం అయింది. ఈ సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తారు.
ఉదయం నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. భారీ క్యూ లైన్లతో ఓపికగా తమ ఓటు హక్కు వినియోగించారు. ఒకటి రెండు చెదురుముదురు ఘటనలు మినహా మిగతా పోలింగ్ అంతా ప్రశాంతంగా సాగింది. ఈసారి యువత పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. తొలిసారి ఓటర్ల సంఖ్య భారీగానే ఉంది.
మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ ఊపందుకుంది. గంట గంటకూ ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు 77 శాతం పోలింగ్ జరిగింది. చివరి గంటలో మరింతగా ఓటర్లు తరలివచ్చారు. సమయం ముగిసినా పలు కేంద్రాల ముందు భారీ క్యూ లైన్లు ఉండటంతో.. వారందరూ ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. గత ఎన్నికల్లో 91 శాతం ఓటింగ్ జరగ్గా.. ఈసారి పోలింగ్ శాతంపై ఆసక్తి పెరిగింది. ఓటింగ్ సరళిపై క్లారిటీ రాకపోవడంతో.. అన్ని పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది.
బయటివాళ్లు నియోజకవర్గంలో ఉన్నారంటూ ఉదయం నుంచి అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వాళ్లు మద్యం, డబ్బులు పంచుతుండగా పలుచోట్ల బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. 42 మందిని గుర్తించి బయటకు పంపించేశామని ఈసీ తెలిపింది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ చండూరులో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకోవడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చండూరులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా.. మర్రిగూడెంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గులాబీ వర్గాలు అడ్డుకున్నాయి.