AP CABINET: ఆంధ్రప్రదేశ్ కేబినేట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీసీటీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతోపాటు వివిధ జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552కోట్ల రుణ సేకరణ చేయాలని తీర్మానం చేశారు. మధురవాడలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థకు 11 ఎకరాల స్థలం కేటాయింపునకు పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అందులో ఖాళీగా ఉన్న 287 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
శ్రీకాకులం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి అనంతపురంలో వైద్య కళాశాలల్లో అంకాలజీ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వృద్దాప్య పించన్లు రూ.3వేలకు పెంచేందకు ఆమోదం తెలిపారు. విశాఖలోని 4 కారిడార్లలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ కు ఆమోదం తెలిపారు. ఆరోగ్య శ్రీని రూ. 25 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఆమోదం తెలిపారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.