Governor Speech : తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.మంత్రులు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ప్రజాసేవలో కొత్త ప్రభుత్వం విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని గవర్నర్ అన్నారు. ప్రమాణస్వీకారం సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను గవర్నర్ గుర్తు చేశారు. తాము సేవకులం మాత్రమేనని పాలకులం కాదని సీఎం అన్న మాటలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ ను ప్రారంభించారని వెల్లడించారు.
ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజావాణిలో భూముల సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని వెల్లడించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు. తమ జీవితాల్లో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని వివరించారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేసిందన్నారు. మహలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామన్నారు. ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో సేవలను పెంచిన విషయాన్ని తెలిపారు. రూ. 10 లక్షల వరకు ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు. రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం ఈ హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
రైతులను ఆదుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామన్నారు. ఆసైన్ ల్యాండ్ లు, పోడు భూమలకు పట్టాలు ఇస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులపై దృష్టిపెడతామన్నారు.
నిరుద్యోగుల కోసం ఇచ్చిన హామీలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 6 నెలల్లో మెగా డీఎస్సీ ద్యారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.
9 ఏళ్ల కేసీఆర్ పాలనలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని.. వ్యక్తుల కోసం వ్యవస్థలు దిగజారడం బాధాకరమన్నారు. ఈ పరిస్థితి రూపు మాపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా నియంత్రించే దిశగా ప్రణాళిక రూపొందించిందని గవర్నర్ అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా ఉపేక్షించేదిలేదన్నారు.
.
.