స్టేజ్ ఏదైనా ఏపీ నేతలంతా ఇప్పుడు పరస్పర విమర్శలు చేసుకుంటూ ఈ వింటర్ సీజన్లో హీట్ రాజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ – చంద్రబాబు భాగస్వామి అంటూ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయనను ఓ ప్యాకేజీ స్టార్గా అభివర్ణించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సైతం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు జగన్. దత్తపుత్రుడిని పక్కన పెట్టుకొని డ్రామాలు ఆడతారని.. మాట మీద నిలబడిన చరిత్ర చంద్రబాబుకు లేదని ఫైర్ అయ్యారు.
అయితే సీఎం జగన్కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గ ఇంఛార్జ్ల మార్పుపై సెటైర్లు వేశారు ఆయన. 150 మందిని మార్చినా ఆ పార్టీకి మళ్లీ అధికారం దక్కదన్నారు. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు చంద్రబాబు. మునిగిపోయే పడవ వైసీపీ అన్నారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు. ఎవరైనా టీడీపీలో చేరతామంటే పరిశీలన చేస్తామంటూ డోర్లు తెరిచారు.
అధికార, విపక్ష పార్టీలు ఇలా ఒకరిపై ఒకరు మాటల దాడి చేస్తుంటే.. తెలంగాణ గడ్డ నా అడ్డా అంటూ ప్రకటించిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మళ్లీ ఏపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్.. అందుకు షర్మిల సరైన లీడర్గా భావిస్తోందన్న ప్రచారం వినిపిస్తోంది. అదే సమయంలో షర్మిల కూడా కొన్ని డిమాండ్లు పెట్టినట్టు చెప్తున్నారు. ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిని చేయడంతో పాటు ఉత్తరాదిన ఓ రాష్ట్రానికి ఇంఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పినట్టు సమాచారం.
నిజానికి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. వెంటనే విశాఖపట్నం, విజయవాడలో షర్మిల బహిరంగ సభలు పెట్టాలని వ్యూహరచన జరిగింది. వైజాగ్లో జరిగే సభకు ప్రియాంకగాంధీ, విజయవాడ సభకు రాహుల్గాంధీ హాజరుకానున్నారు. అయితే రాయలసీమలో షర్మిల రాజకీయం ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కాంగ్రెస్ – షర్మిల పొలిటికల్ డీల్ ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ రుద్రరాజు నాయకత్వంలో చేరికలు లేవని.. షర్మిల ఎంట్రీతో వైసీపీ అసంతృప్త నాయకులకు గాలం వేయొచ్చని హైకమాండ్ ఆలోచనగా చెప్తున్నారు.