Nagole: మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఓ కానిస్టేబుల్ నడి రోడ్డుపై దౌర్జన్యానికి దిగాడు. ఒకరిపై దాడికి పాల్పడ్డాడు. మరొకరిని అసభ్య పదజాలంతో దూషించాడు. బండ్లగూడ పరిధి ఆనంద్నగర్ చౌరస్తాలో తాగునీటి కోసం జలమండలి సిబ్బంది పైపులైను తవ్వకాలు చేపట్టారు.
నాగోల్ రహదారి లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ఏకకాలంలో ఒక వాహనం మాత్రమే వెళ్లే వీలుంది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇసుక లారీ వెళ్తుండగా.. చైతన్యపురి ఠాణాలో పని చేస్తున్న కానిస్టేబుల్ కారులో వెళ్లేందుకు ప్రయత్నించాడు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో కారు లారీని తాకింది.
దాంతో కానిస్టేబుల్ ఆగ్రహానికి గురై.. లారీడ్రైవర్ను అసభ్య పదజాలంతో దూషించి కాలుతో తన్ని దాడి చేశాడు. కారు మరమ్మతులకు డబ్బులు ఇవ్వాలని లారీడ్రైవర్ తో కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ కారణంగా ఆ మార్గంలో వాహన రాకపోకలు ఆగిపోయాయి. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. పక్కకు తీసి.. మాట్లాడుకోవాలని ఓ వాహనదారుడు చెప్పడంతో.. కానిస్టేబుల్ అతడిని కూడా అసభ్యపదజాలంతో దూషించాడు.
దీనిపై సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ‘‘ఆనంద్నగర్ చౌరస్తాలో ఒక వ్యక్తి దూషిస్తూ రాకపోకలు స్తంభింపచేసినట్లు బుధవారం రాత్రి తమకు సమాచారం అందిందని, వెంటనే కానిస్టేబుళ్లను పంపించామని తెలిపారు. ఆ తర్వాత తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామన్నారు.