Bapu Birth Anniversary : తెలుగుతనానికి గుర్తుగా ఎవరినన్నా వర్ణించాలి అంటే ఆ అమ్మాయి బాపు బొమ్మలా ఉంది అంటారు .అంతగా బాపు సినీ ఇండస్ట్రీ పైనే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులపై కూడా చెరగని ముద్ర వేశారు. తెలుగుతనానికి వన్నెలద్దిన చిత్రకారుడు.. తేట తెలుగులోని కమ్మదనాన్ని వ్యక్తీకరించే ఒక భావు కవి.. తన బొమ్మలతో కథకే ప్రాణం పోసే ఓ బ్రహ్మర్షి.. బాపు కాక మరెవరు. ఈరోజు బాబు జయంతిని పురస్కరించుకొని బిగ్ టీవీ తరఫున ప్రత్యేక కథనం..
ఆబాలగోపాలాన్ని తన కథలతో కట్టిపడేసిన విశ్వబ్రాహ్మ బాపు అనడంలో ఎటువంటి సందేహం లేదు. శాంతము, కరుణము, భయంకరము, భీభత్సము, రౌద్రం, అద్భుతం, వీరం, హాస్యం..ఇలా నవరసాలను పండించే సినిమాలను తీయడమే కాకుండా ప్రేక్షకులకు ఒక మంచి సందేశాన్ని కూడా అందించే విధంగా కథ ఉండేలా చూసుకోవడం బాపు ప్రత్యేకత. ఆయన బొమ్మలే కాకుండా ప్రత్యేకంగా ఉండే ఆయన చేతిరాతకు బాపు ఫాంట్ అని గుర్తింపు కూడా వచ్చింది.
1933 డిసెంబర్ 15న పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురం లో వేణు గోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు బాబు. ఆయన అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ.. అయితే కలం పేరు బాపుతో బాగా ఫేమస్ అయ్యారు. 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఈయన లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరంలో ఒక వ్యంగ్య చిత్రకారునిగా ఆంధ్ర దినపత్రికలో చేరారు. 1967లో కృష్ణ ,విజయనిర్మల కాంబోలో వచ్చిన సాక్షి మూవీకి మొదటిసారి దర్శకుడిగా పరిచయమయ్యారు.
దర్శకుడిగా ఫస్ట్ మూవీ తోటే మంచి సక్సెస్ అందుకున్నారు బాబు. తన ప్రత్యేకమైన శైలిని మొదటి సినిమా తోటి పరిచయం చేస్తూ బాపు మార్క్ సినిమా ఇది అనేలా గుర్తింపు తెచ్చుకున్నారు. బాబు పేరు ఎప్పుడు చెప్పినా.. జంట మామిడి పండ్ల మాదిరి మరొక పేరు కూడా మనకు గుర్తుకు వస్తుంది. ఆ వ్యక్తి ముళ్ళపూడి వెంకటరమణ. వీరిద్దరి ఫ్రెండ్షిప్ ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలుసు. సాక్షి సినిమా దగ్గరనుంచి రమణ.. బాబు సినిమాలకు రచయితగా పనిచేశారు. వీళ్ళిద్దరి కాంబో ఎంత బాగా పేరు తెచ్చుకుంది. అలాగే ఈ ఇద్దరి సృష్టిలో నుంచి వచ్చిన బుడుగు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరోయిన్ కి డ్రీమ్ రోల్ ఏది అంటే బాపు సినిమాలో హీరోయిన్ గా చేయడం అని వెంటనే చెబుతారు. ఆయన హీరోయిన్ కి ఇచ్చే ఎలివేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది. ఆకట్టుకునే హావభావాలే కాకుండా.. తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఎంతో సంప్రదాయంగా.. ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా హీరోయిన్ పాత్ర సృష్టించడంలో బాపు ఎక్స్పర్ట్. ఇక బాపు సినిమాల్లో విలన్ పాత్ర కూడా ఎంతో విలక్షణంగా ఉంటుంది. ముత్యాల ముగ్గు లో రావు గోపాల్ రావు విలన్ పాత్ర ఇప్పటికీ కూడా ఒక వండర్ అనే చెప్పాలి.
బాపు తెరకెక్కించిన ఉత్తమ చిత్రాలలో సీతా కళ్యాణం ఒకటి.. అప్పట్లోనే ఈ చిత్రాన్ని లండన్ ,చికాగో ఫిల్మ్ ఫెస్టివల్ లలో ప్రదర్శించారు. బాలీవుడ్ లో కూడా సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు బాపు. ఇక బాపు సినిమాలకు సంబంధించిన స్టోరీ బోర్డ్ మరింత ప్రత్యేకం.. ఎందుకంటే బాపు తన స్టోరీ బోర్డు ముందుగా తానే ప్రిపేర్ చేస్తారు.. అది కూడా సీన్ టు సీన్ బొమ్మల రూపం లో.. ఆ తర్వాత ఆ చిత్రాన్ని అచ్చం అలాగే తెరపై చిత్రీకరించేవారు.
ఇక బాపు తీసిన మిస్టర్ పెళ్ళాం ,పెళ్లి పుస్తకం.. లాంటి చిత్రాలు ప్రతి సంసారంలో జరిగే గొడవలను సరదాగా చూపిస్తూ ..భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఎంత ముఖ్యమో చాటుతాయి. గిల్లికజ్జాలతో సాగే రొమాన్స్ ను అందంగా తెరపై ఆవిష్కరించడం ఒక బాపుకే సాధ్యమనిపిస్తుంది. సాంఘిక చిత్రాలతో పాటు..భక్తి చిత్రాల లో కూడా బాపు భక్తి రసాన్ని పండించారు.
‘సీతా కళ్యాణం’, ‘సంపూర్ణ రామయణం’, ‘శ్రీ రామాంజనేయ యుద్దం’ ’శ్రీ రామ రాజ్యం’,లాంటి ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు.
బాపు తీసిన చివరి సినిమా బాలకృష్ణ ,నయనతార కాంబినేషన్ లో వచ్చిన శ్రీరామరాజ్యం. వెండితెర పైనే కాకుండా బాపు బుల్లితెరపై కూడా ఎన్నో అద్భుతాలను సృష్టించారు. భాగవతం అనే ధారావాహికతో ప్రతి ఇంటికి దశావతారాలను అద్భుతంగా పరిచయం చేశారు. ఈరోజుకి కూడా అది ఒక సుందర.. సుమధుర దృశ్య కావ్యం.2014 ఆగస్టు 31 న బాపు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. భౌతికంగా దూరమైన.. ఆయన తీసిన చిత్రాల రూపంలో ఎప్పటికీ చిరంజీవి గానే మిగిలిపోయారు.