తెలంగాణ అసెంబ్లీ కొలువు దీరింది. సభ్యులు, మంత్రుల ప్రమాణ స్వీకరాలు పూర్తి అయ్యాయి. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఏ ఏ అంశాలు ప్రస్తావిస్తారని ఉత్కంఠ కొనసాగుతుంది. అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై చర్చించారు. తర్వాత ప్రసంగానికి ఆమోదం తెలిపారు. సుమారు గంట పాటు జరిగిన కేబినెట్ భేటీలో గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
కాంగ్రెస్ పాలనను ప్రతిభింబించేలా గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపించారు. ప్రజావాణి ఏర్పాటు, ప్రగతిభవన్ కంచె తొలగించడం వంటి నిర్ణయాలతో అందరిని ఆకర్షించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీల్లో ఇప్పటికే 2 హామీలు అమలు చేస్తున్నారు. దీంతో పాటు.. ప్రతీ శాఖలో సమీక్ష సమావేశాలు నిర్వహించి.. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ అంశాలు అన్ని గవర్నర్ ప్రసంగంలో ఉండనున్నాయి. వీటితో పాటు.. ఐదేళ్లలో ప్రభుత్వ లక్ష్యాలు ఏంటీ అనేది గవర్నర్ చెప్పనున్నారు.