కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తుందంతే. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలులోకి తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకంలో.. నేటి నుంచి మహిళలందరికీ జీరో టిక్కెట్లను జారీ చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తుండగా..నేటి జీరో టిక్కెట్లతో ఈ సౌకర్యాన్ని మరింత సులభతరం చేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో భాగంగా ఆర్టీసీ ప్రయాణాన్ని మహిళలకు ఉచితంగా అందచేస్తుంది. దీనికి సంబంధించి నేటి నుంచి జీరో టిక్కెట్లు ఇస్తున్నారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ను తీసుకుని.. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా పథకం అమలవుతోందని, పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్వేర్ను.. సంస్థ అప్ డేట్ చేసిందని సజ్జనార్ తెలిపారు.
టిమ్ మెషిన్ల ద్వారా జీరో టికెట్లను జారీ చేయనున్నారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని సూచించారు. స్థానికత ధ్రువీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి జీరో టిక్కెట్ను పొందవచ్చునని వివరించారు.
ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్వేర్ను అప్డేట్ చేసి.. అందుబాటులో తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను సజ్జనార్ అభినందించారు.