Bhagat Singh connection in Parliament attack | ఈ సంవత్సరంలో జరిగిన అతిపెద్ద షాకింగ్ ఘటనలలో.. బుధవారం పార్లమెంట్లో జరిగిన భారీ భద్రతా ఉల్లంఘన ఒకటి. ఇద్దరు చొరబాటుదారులు లోక్సభలోకి ప్రవేశించి పసుపు పొగ డబ్బాలను పేల్చారు. మరో ఇద్దరు భవనం వెలుపల ఎరుపు, పసుపు రంగు డబ్బాలను పేల్చారు. ఇందులో మొత్తం ఆరుగురి ప్రమేయం ఉండగా, ఐదుగురిని అరెస్టు చేశారు.
Bhagat Singh connection in Parliament attack | ఈ సంవత్సరంలో జరిగిన అతిపెద్ద షాకింగ్ ఘటనలలో.. బుధవారం పార్లమెంట్లో జరిగిన భారీ భద్రతా ఉల్లంఘన ఒకటి. ఇద్దరు చొరబాటుదారులు లోక్సభలోకి ప్రవేశించి పసుపు పొగ డబ్బాలను పేల్చారు. మరో ఇద్దరు భవనం వెలుపల ఎరుపు, పసుపు రంగు డబ్బాలను పేల్చారు. ఇందులో మొత్తం ఆరుగురి ప్రమేయం ఉండగా, ఐదుగురిని అరెస్టు చేశారు.
లోక్సభలో అలజడి సృష్టించిన సాగర్ శర్మ, మనోరంజన్ ను అరెస్టు చేశారు. ఇక నీలం దేవి, అమోల్ షిండే అనే మరో ఇద్దరు పార్లమెంటు భవనం వెలుపల నినాదాలు చేసి.. పసుపు, ఎరుపు పౌడర్లను చల్లినందుకు వారిని కూడా అరెస్టు చేశారు. గురుగ్రమ్కు చెందిన లలిత్ ఝా, విక్కీ శర్మ ఇతర నిందితులు. లలిత్ ఝా సంఘటన వీడియోలను చిత్రీకరించి.. వారి సెల్ఫోన్లతో పారిపోయాడు.
ఉల్లంఘనకు ప్లాన్ చేసిన ఆరుగురికి చాలా పోలికలు ఉన్నాయి. వీరందరూ గురుగ్రామ్లోని ఒక ఇంట్లో ఉన్నారు. వీరిలో కొందరు నిరుద్యోగులు కాగా.. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ నుంచి స్ఫూర్తి పొందారని విచారణలో తేలింది.
పార్లమెంటు చొరబాటుదారులు విప్లవకారుడిని అనుకరించడానికి ప్రయత్నించారా అంటే అవుననే తెలుస్తోంది. 8 ఏప్రిల్ 1929లో భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్.. ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీపై బాంబులు విసిరిన సాహసోపేతమైన చర్యను పరిశీలిస్తే – ఇది భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత వీరోచిత క్షణాలలో ఒకటని చెప్పొచ్చు.
భగత్ సింగ్ కనెక్షన్ !
ఆరుగురు నిందితుల్లో.. నలుగురు సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు టచ్లో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. భగత్ సింగ్ పట్ల పరస్పర అభిమానం వారిని కలిపిందని తెలుస్తోంది. నలుగురూ భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే గ్రూప్లో భాగమైనట్లు సమాచారం. వారు అతని భావజాలం నుంచి ప్రేరణ పొందారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
భద్రతా ఉల్లంఘనకు సూత్రధారి అయిన డి మనోరంజన్ మైసూరుకు చెందిన ఇంజనీర్. లక్నోకు చెందిన సాగర్ శర్మ.. గ్రాడ్యుయేట్. నీలమ్.. హర్యాన లోని హిసార్ నుంచి సివిల్ సర్వీస్ కు ప్రిపేర్ అవుతోంది. అన్మోల్ షిండే.. పోలీస్, సైనిక పరీక్షల అభ్యర్ధిగా ఫెయిల్ అయ్యాడు.
నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిరసన చేయడానికి.. పాలసీ మేకర్స్కు వారి ఆందోళనలను తెలిసేలా చేయడానికి ఉల్లంఘనను ప్లాన్ చేశామని నలుగురు విచారణ సమయంలో చెప్పారు. తాము ఫేస్బుక్లో కలుసుకున్నామని, మొహాలీలో ఎయిర్పోర్ట్కి షహీద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చాలని కోరుతూ జరిగిన ప్రదర్శనతో సహా ఇతర నిరసనల్లో భాగమేనని నిందితులు పేర్కొన్నారు.
బీఆర్ అంబేద్కర్.. భగత్ సింగ్ భావజాలం నీలమ్ను ప్రేరేపించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె తన గ్రామంలోని యువకులకు విప్లవ వీరుడికి సంభందించిన పుస్తకాలు పంపిణీ చేస్తుందని ఇరుగుపొరుగు వారు స్థానిక మీడియాకు తెలిపారు.
కుట్రదారులు 11 నెలల పాటు ఈ భద్రతా ఉల్లంఘనకు ప్లాన్ చేశారని, వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్లో రెక్కీ కూడా చేశారని తెలిసింది. మనోరంజన్, సాగర్ శర్మ గత మూడు నెలలుగా పర్లమెంట్ సందర్శకుల పాస్ కోసం ప్రయత్నిస్తున్నారని.. ఇద్దరికి బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా పాస్లు ఇచ్చారని.. ఎంపీ కార్యాలయం పోలీసులతో తెలిపింది.
వీరిద్దరూ పార్లమెంటులోకి చొరబడి, లోక్సభ ఛాంబర్లోకి దూకి, ఆపై పసుపు డబ్బాలను పేల్చారు. సందర్శకుల గ్యాలరీ నుంచి దూకి స్పీకర్ కుర్చీ వైపు దూసుకువెళ్లారని బీఎస్పీ ఎంపీ శ్యామ్ నారాయణ్ యాదవ్ తెలిపారు.
పసుపు ఎంపికకు భగత్ సింగ్తో సంబంధం ఉంది. ఇది స్వాతంత్ర్య సమరయోధుడికి ఇష్టమైన రంగు అని నమ్ముతారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆయన కూడా పార్లమెంటులో బాంబు పేల్చారు.
భగత్ సింగ్ మహాత్మా గాంధీ నుంచి ప్రేరణ పొందాడు. సహాయ నిరాకరణ ఉద్యమం విరమణ.. అహింసా మార్గాన్ని సింగ్ ప్రశ్నించేలా చేసింది. కళాశాలలో.. చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, సుఖ్దేవ్ థాపర్, ఇతర విప్లవకారులను సింగ్ కలుసుకున్నాడు. వారందరూ కలసి హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ (HSRA)ను స్థాపించారు.
బుధవారం లోక్సభలో భద్రతను ఉల్లంఘించిన నలుగురు నిందితులు.. 8 ఏప్రిల్ 1929న భగత్ సింగ్ చేసిన పనిని అనుకరించేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. 94 సంవత్సరాల క్రితం, భగత్ సింగ్ అతని సహచరుడు బతుకేశ్వర్ దత్ ఢిల్లీ అసెంబ్లీ సెంట్రల్ ఛాంబర్లోకి చొరబడ్డారు.వారు ఛాంబర్పై బలహీనమైన బాంబులు విసిరారు. విప్లవాత్మక కరపత్రాలను విసిరి.. దేశభక్తి నినాదాలు చేశారు.
భారతదేశం వలస పాలనతో పోరాడుతున్న సమయం అది. స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత వీరోచిత క్షణాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది.
1928లో ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులు పార్లమెంటులోకి చొరబడి.. ఎవరినీ నొప్పించడం తమ లక్ష్యం కాదని.. కేవలం బ్రిటిష్ వారికి తమ పోరాటం గురించి తెలిసేలా చేయాలనేదే తమ లక్ష్యమని కోరుకున్నారు. భారతీయులు శాసనసభలో కూర్చున్నారు కానీ అధికారం లేదనే సందేశాన్ని చంద్రశేఖర్ ఆజాద్ సారథ్యంలోని హెచ్ఆర్ఎస్ఎ, ప్రపంచానికి పంపాలనుకుంది.
8 ఏప్రిల్ 1929న, ప్రజా భద్రత, వాణిజ్య వివాదాల బిల్లులను అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు వ్యతిరేకించిన తర్వాత కూడా, వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ వాటిని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అనే రోజున వీరు దాడికి ప్లాన్ చేశారు.
వీరిద్దరూ ఖాకీ షర్టులు, షార్ట్లు ధరించి సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నారు. వారు రెండు బాంబులను విసిరారు. ఆ తర్వాత భగత్ సింగ్ పిస్టల్తో కాల్పులు జరిపాడు. దత్ HSRA కరపత్రాలను గాలిలోకి విసిరాడు. వారిద్దరూ ఇంక్విలాబ్ జిందాబాద్, డౌన్ విత్ బ్రిటిష్ ఇంపీరియలిజం అని నినాదాలు చేశారు.
“చెవిటివారు వినడానికి పెద్ద స్వరం కావాలి, ఫ్రెంచ్ అరాచక అమరవీరుడు వాలియంట్ ఇలాంటి సందర్భంలో పలికిన ఈ పదాలతో, మా చర్యను మేము గట్టిగా సమర్థిస్తాము” అనే HSRA కరపత్రాలను దత్ విసిరాడు.
వారిద్దరూ తప్పించుకునే ప్రయత్నాలు చేయకపోవడంతో అరెస్టు చేశారు. సంఘటన జరిగిన ఒక నెల తర్వాత, విచారణ ప్రారంభమైంది. 1929 జూన్ 12న వారికి జీవిత ఖైదు విధించారు. వారికి ఎలాంటి పశ్చాత్తాపం లేదు.
1928లో లాహోర్లో బ్రిటీష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్కు మరణశిక్ష విధించారు. అతన్ని 23 మార్చి 1931న లాహోర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు.
భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర్య సమరయోధుడిని ఆదర్శంగా తీసుకునప్పుడు .. ఆ ఆశయాలను మంచి కోసం ఉపయోగించాలి. బుధవారం పార్లమెంట్లో జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటిది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.