Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ తీసుకున్న నిర్ణయం సూచీలకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడంతో పాటు.. భవిష్యత్ లో రేట్ల తగ్గింపు ఉంటుందన్న సంకేతాలివ్వడంతో.. స్టాక్ సూచీలు లాభాల వైపు పరుగులు తీశాయి.
ఐటీ, రియల్టీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 21,150 పాయింట్ల ఎగువస్థాయిలో నిలిచింది. బీఎస్ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.355 లక్షల కోట్లకు చేరింది.
గురువారం ఉదయం 70,146 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 70,110.75-70,602.89 మధ్య కదలాడింది. చివరికి 929.60 పాయింట్ల లాభంతో 70,514.20 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 256.35 పాయింట్ల లాభంతో 21,182.70 వద్ద స్థిరపడింది.
స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియగా.. డాలరుతో రూపాయి మారకం విలువ 83.33 గా ఉండగా.. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర 75.63 డాలర్ల వద్ద ట్రేడవుతుంది. ఈ సమయంలో బంగారం ఔన్సు 2049 డాలర్లకు ఎగబాకింది.
సెన్సెక్స్ లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ సీఎల్ టెక్నాలజీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు రాణించగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, టైటాన్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో షాంఘై, నిక్కీ మినహా మిగతా అన్ని మార్కెట్లు లాభపడ్డాయి.