Cm revanth Reddy: ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుని అక్కడ సీఎం క్యాంపు ఆఫీస్ నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కానీ భవిష్యత్తులో ఇక ఎలాంటి భవనాలను నిర్మించబోమన్నారు. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేయకుండా ఉన్న వాటినే సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు. శాసన సభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 12,14 గంటలకు మించి కరెంటు ఇవ్వలేదని సీఎం అన్నారు . 24 గంటల కరెంటు ఇచ్చారని చెప్పుకున్నారని విమర్శించారు. ఇక అన్ని అంశాలపై అందరితో చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు. రేపు బీఏసీలో సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. ఫలక్ నామా నుంచి విమానాశ్రయానికి మెట్రోను ప్లాన్ చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఏ శాఖ ఏం పనులు చేసింది. భవిష్యత్తులో ఏం చేయాలనే ప్రణాళికను సిద్దం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రగతి భవన్ పేరును జ్యోతిబా పూలే ప్రజా భవన్ గా పేరు మార్చారు. విద్యుత్ శాఖ, ఎక్సైజ్ శాఖ, టీఎస్పీఎస్సీ అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి అన్ని చర్యలను పకడ్బందీగా తీసుకుంటున్నారు. భవనాల కోసం కొత్త వ్యయాలు చేయకుండా ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.