Farmers Suicides: మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 10 నెలల్లోనే 2 వేలకు పైగా రైతులు బలవన్మరణం చెందారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2366 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ లెక్కలు అధికారికంగా మాత్రమే. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు. కాగా.. అధికారిక లెక్కల ప్రకారం ఉన్న రైతు ఆత్మహత్యలు.. అత్యధికంగా అమరావతి డివిజన్ లోనే జరిగినట్లు తేలింది.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకూ రాష్ట్రవ్యాప్తంగా 2366 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇందులో అత్యధికంగా అమరావతి డివిజన్ లోనే 951 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడగా.. ఛత్రపతి శంభాజినగర్ డివిజన్ లో 877, నాగ్ పుర్ డివిజన్ లో 257, నాసిక్ డివిజన్ లో 254, పుణె డివిజన్ లో 27 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి అనిల్ భైదాస్ వెల్లడించారు.
కాగా.. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కాంగ్రెస్ సభ్యుడు కునాల్ పాటిల్ అడిగిన ప్రశ్నకు.. మంత్రి అనిల్ భైదాస్ అసెంబ్లీలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులకు రాష్ట్రప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు.