IND vs SA 3rd T20 : ఇవేం క్రికెట్ మ్యాచ్ లు అని క్రికెట్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. నిజాయితీగా మ్యాచ్ లు జరగవా? అని ప్రశ్నిస్తున్నారు. ఇవెక్కడ తొండి ఆటలని అంటున్నారు. మొదట బ్యాటింగ్ చేసేవారికి పిచ్ ఒకలా స్పందించడం, రెండోసారి బ్యాటింగ్ చేసేవారికి ఒకలా స్పందించడం…ఇదెక్కడి గోల? అని నెట్టింట గగ్గోలు పెడుతున్నారు…ఇలా జరిగితే, అవి అంతర్జాతీయ మ్యాచ్ లు ఎందుకవుతాయి? అని ప్రశ్నిస్తున్నారు.
ఎండకు ఎండినా, వర్షం వచ్చినా, మంచు కురిసినా ఏం జరిగినా పిచ్ స్వభావం ఒకేలా ఉండాలి…అలా పిచ్ లను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇందులో ఆటగాళ్ల గొప్పతనం ఏమీ కనిపించడం లేదు. పిచ్ గొప్పతనమే అందులో కనిపిస్తోంది. పిచ్ లు ఇలా ఉండటంతో అక్కడ టాస్ లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. టాస్ గెలిచినవాళ్లు సగం మ్యాచ్ గెలిచినట్టేననే భావం వ్యక్తమవుతోంది.
ఆ పిచ్ స్వభావాన్ని బట్టి టాస్ గెలిచినవాళ్లు ఆప్షన్ తీసుకుంటున్నారు. లబ్ధి పొందుతున్నారు. అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కూడా పిచ్ ఒక్కటే ఇండియా కొంపముంచిందనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు సౌతాఫ్రికాలో జరగనున్న మూడో టీ 20కి కూడా వరుణుడి ఎఫెక్టు పడనుందని సమాచారం. అయితే జల్లులు పడతాయని అంటున్నారు. దానిని బట్టి పిచ్ స్వభావం కూడా మారిపోయేలా ఉందని అంటున్నారు. బ్యాటింగ్ కి అనుకూలంగా ఉందని చెబుతున్నారు.
ఒకవేళ మన కెప్టెన్ సూర్యకుమార్ అదృష్టం బాగాలేక టాస్ ఓడిపోతే, ఇంతే సంగతి అన్నట్టుంది. మరి ఆ పరిస్థితి రాకూడదంటే అన్ని రకాలుగా మ్యాచ్ లో కలిసి రావాలి. ఇకపోతే చంద్రమండలంపైకి రాకెట్ ని పంపించినంత టెక్నాలజీ సొంతమైన భారతదేశానికి, అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే పిచ్ లు, రెండు జట్లకి సమానంగా స్పందించేలా తయారు చేయలేరా? లేక కనిపెట్టలేరా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై ఐసీసీ, క్రికెట్ ఆడే అన్ని దేశాలు కూడా కలిసి నిర్ణయం తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. లేదంటే ఇదెక్కడి గోల, టాస్ గెలిస్తే ఒకలా, పిచ్ రెస్పాన్స్ ని బట్టి ఒకలా ఆడితే, ఇక ఆటగాళ్ల గొప్పతనం ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్ చూసే ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అంటున్నారు.
రెండు వైపులా పిచ్ ఒకేలా స్పందిస్తే, అప్పుడు టాస్ గొడవే ఉండదు. అంతేకాదు ఆటగాళ్లలో నిజమైన హీరోలు బయటకు వస్తారని అంటున్నారు.