Parliament Security Breach: భారతదేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంట్ లో బుధవారం చెలరేగిన ఓ అలజడి.. యావత్ దేశమంతా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ గురువారం కీలక మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
కాగా.. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై లోక్ సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది. పార్లమెంట్ లో అలజడి చెలరేగిన సమయంలో విధుల్లో ఉన్న 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు గురువారం ఆందోళన చేపట్టాయి. లోక్ సభలో భద్రతా వైఫల్యంపై చర్చచేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో కొంతసేపు సభంతా ఆందోళనలు సాగాయి. విపక్షాల ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో స్పీకర్ వారిని వారించారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకూ లోక్ సభ వాయిదా పడింది.
బుధవారం పార్లమెంట్ లో జరిగిన ఘటన నేపథ్యంలో.. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మకరద్వారం నుంచి కేవలం ఎంపీలను మాత్రమే లోపలికి అనుమతించారు. మీడియాను కొద్దిమీటర్ల దూరంలోనే ఆపివేశారు. పార్లమెంట్ కు వచ్చే ప్రతి ఒక్కరి బూట్లను కూడా గురువారం స్కాన్ చేశారు.