Ministers : తెలంగాణలో పలువురు మంత్రులు గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రజాభవన్లో తొలుత భట్టి విక్రమార్క దంపతుల గృహప్రవేశం చేశారు. భట్టి కుటుంబ సభ్యులు పూజలు చేసి హోమం నిర్వహించారు. ఆ తర్వాత సచివాలయంలో ఆర్థికమంత్రిగా భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు.
పలు శాఖలకు నిధులు మంజూరు చేస్తూ భట్టి విక్రమార్క సంతకాలు చేశారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సబ్సిడీ రూ.374 కోట్లు విడుదల చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.298 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు , సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు విడుదల చేశారు.
తన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛారణాలు, ఆశీర్వచనాల మధ్య ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వచనాల తర్వాత శ్రీధర్బాబు బాధ్యతలు చేపట్టారు. మంత్రికి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమశాఖ మంత్రిగా సచివాలయంలో సీతక్క బాధ్యతలు స్వీకరించారు. నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ, సమాచార శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించి.. డీపీఆర్వోలకు అధునాతన కెమెరాలు అందజేసే దస్త్రంపై సంతకం చేశారు.