2024 Parliament Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి అధికారం కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ విజయడంఖా మోగించనుందని టైమ్స్ నౌ సర్వేలో వెల్లడైంది.
ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 10 మధ్యలో సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే ప్రకటించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితిని.. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి ఈ సర్వే ప్రకటించినట్లు టైమ్స్ నౌ సంస్థ పేర్కొంది.
అలానే బీఆర్ఎస్, బీజేపీలకు 3 నుంచి 5 మధ్య సీట్లు రావొచ్చని.. మజ్లిస్ పార్టీకి ఒక సీటు వస్తుందని సర్వేలో తేల్చారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది.. కాంగ్రెస్ కి 3.. బీజేపీకి 4 చొప్పున వచ్చాయి. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు ఉంటాయని టైమ్స్ నౌ విశ్లేషించింది. కాంగ్రెస్ పార్టీకి 37 శాతం.. బీఆర్ఎస్ కి 32 శాతం.. బీజేపీకి 24 శాతం ఓటింగ్ రావొచ్చని అంచనా వేశారు.
ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీయే అధికారంలోకి రానుందని సర్వేలో వెల్లడైంది. మోదీ సర్కార్ హ్యాట్రిక్ విజయాన్ని.. బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే కూటమి 323 స్థానాల్లో.. ఇండియా కూటమి 163 స్థానాల్లో.. ఇతరులు 57 స్థానాలు గెలుచుకోవచ్చని ప్రకటించారు.