Speaker : తెలంగాణ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. గడ్డం ప్రసాద్ను స్పీకర్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూర్చోబెట్టారు. సభలో ఉన్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గడ్డం ప్రసాద్కు అభినందనలు తెలిపారు.
స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని.. మంచి సంప్రదాయానికి సభ తొలిరోజే నాంది పలికిందన్నారు. భవిష్యత్లోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని సీఎం రేవంత్రెడ్డి పిలపునిచ్చారు.
స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. ఆయనతో కలిసి పని చేసినందుకు గర్విస్తున్నానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కరించేందుకు గడ్డం ప్రసాద్ సలహాలు ఇవ్వాలని కోరారు.
స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. కేసీఆర్ ఆదేశాలతో ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ సహకరించిందన్నారు. ఎంపీటీసీ నుంచి స్పీకర్గా ఎదిగిన మీ జీవితం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అన్నారు.
అంతకు ముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.కేటీఆర్, కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.