హైదరాబాద్లో మెట్రో రైలు విస్తరణ విషయంలో సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు. ఓఆర్ఆర్ వెంట జీవో 111 ప్రాంతంలో మెట్రో ఎలైన్మెంట్ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే అక్కడ ORR ఉన్న నేపథ్యంలో.. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి ప్రత్యామ్నాయంగా MGBS-ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, ఎయిర్పోర్టు మీదుగా ఎలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు.
ఇందులో భాగంగా 2 మార్గాలను పరిశీలించాలని సూచించారు. చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, జల్పల్లి, విమానాశ్రయం పీ7 రోడ్డు ఒక మార్గం కాగా.. చాంద్రాయణగుట్ట, బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం రోడ్డు మార్గాన్నీ అధ్యయనం చేయాలని, ఇందులో ఏదీ తక్కువ ఖర్చు అయితే దానికి ప్రాధాన్యం ఇచ్చి కొత్త ఎలైన్మెంట్ రూపొందించాలని సూచించారు. తద్వారా తూర్పు, మధ్య, పాత నగరంలోని అధిక జనాభాకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు.
రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో లైను నిర్మాణం కోసం గత BRS ప్రభుత్వం ఎలైన్మెంట్ను ఖరారు చేసి.. టెండర్లను కూడా పిలిచింది. వాటిని ఆమోదించే దశలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాటి ఖరారుపై నిర్ణయం తీసుకోలేదు. ఈ లైనుకు దాదాపు 6వేల250 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మార్గానికి హెచ్ఎండీఏ నుంచి 600 కోట్లు ఇస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.
ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుదీరగా.. ఈ లైన్ విషయంలో సర్కారు వైఖరిలో మార్పు వచ్చింది. శంషాబాద్ నుంచి విమానాశ్రయానికి ORR ఉండటంతో ఈ కారిడార్లో మెట్రో లైను అవసరం లేదని సీఎం రేవంత్ భావిస్తున్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం మెట్రోపై ఆయన సమీక్ష చేశారు.
విమానాశ్రయం నుంచి తుక్కుగూడ మీదుగా ఈ మెగా కొత్త నగరానికి మెట్రో రైలు కనెక్టివిటీని ప్లాన్ చేయాలని ఆదేశించారు. పాతబస్తీలో 5.5 కిలోమీటర్ల మేర పూర్తికానప్పటికీ మెట్రోరైలు గుత్తేదారు L అండ్ TMRHLకు అనేక ప్రయోజనాలు అందజేయడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆదేశించారు.
అలాగే కందుకూరు సమీపంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిలో పర్యావరణహిత మెగా టౌన్షిప్కు ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. కాలుష్య కారకమైన ఫార్మా సిటీ హైదరాబాద్కు సమీపంలో ఉండకూడదని సుదూర ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నారు.