ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం ఇబ్రహీంపట్నం మండలం జూపూడి పరిసర ప్రాంతాలలో నివాసాల మధ్య ఉన్న అక్రమ బూడిద నిలువలను వారం రోజుల్లో తొలగించకపోతే భారీ ప్రజా పోరాటం చేపడతామని జనసేన మండలాధ్యక్షుడు పోలిశెట్టి తేజ హెచ్చరించారు. స్థానిక ప్రజలతో పరిసర ప్రాంతాలలో నివాసాల మధ్య ఉన్న బూడిద నిల్వలను సందర్శించారు. ఈ సందర్భంగా బూడిద నిల్వల వలన ఇళ్లలో కనీసం వంట చేసుకునేందుకు వీలు లేదని మహిళలు తేజకు తెలిపారు.
అనంతరం తేజ మీడియాతో మాట్లాడుతూ.. నివాసాల మధ్య ఇంత భారీ స్థాయిలో బూడిదలు అక్రమ నిల్వ చేసి రవాణా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు బూడిద నిల్వలు మీవంటే- మీవి అని విమర్శలు చేయటం హాస్యస్పదమన్నారు. ఇందులో ఇరు పార్టీలకు భాగస్వామ్యం ఉందని అన్నారు. ఇప్పటికైనా డ్రామాలు ఆపి ప్రజా ఆరోగ్యం దృష్ట్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బూడిద వలన స్థానిక ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, హార్ట్ ఎటాక్ లాంటి రోగాల బారిన పడుతుండటం తీవ్రంగా కలచవేసిందని అన్నారు.
ఈ విషయంపై త్వరలో అన్ని శాఖల అధికారులను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. వారం రోజుల్లో పూర్తిస్థాయి చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో భారీ ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి, అధికారులకు అల్టిమేట్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ప్రసాద్,కొండలరావు, సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు బాబురావు, జనసేన పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.