ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ను ఉద్దేశించి మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో హెలికాప్టర్లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ అధికారి ఆమె మాత్రమేనంటూ పోస్టు చేశారు. స్మితా సబర్వాల్ను కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
గతంలో ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసులకు వెళ్లి, అక్కడి నెట్వర్క్స్ను వాడుకొని, ఇక్కడి తప్పులను తప్పించుకోవడం కొంత మంది ఐఏఎస్ అధికారులకు ఫ్యాషన్ అయ్యింది అంటూ ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు. గత ప్రభుత్వంలో సీఎంవో అదనపు కార్యదర్శిగా, సాగునీటి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు స్మితా సభర్వాల్. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక.. ఇప్పటివరకూ సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఆకునూరి మురళి చేసిన ట్వీట్ కు ప్రాధాన్యం ఏర్పడింది.
తాను కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నానన్న వార్తలపై.. స్మిత సబర్వాల్ స్పందించారు. తానెక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎటువంటి బాధ్యత అయిన స్వీకరిస్తానని స్పష్టం చేశారు. సోషల్మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. మంత్రి సీతక్కను స్మితా సభర్వాల్ కలిశారు.