Telangana Assembly : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ రూపురేఖలను మార్చేందుకు సిద్ధమయ్యారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి అసెంబ్లీ ఆవరణమంతా తిరిగారు. అక్కడ పరిసరాలను పరిశీలించారు. అసెంబ్లీ భవన సముదాల రూపురేఖలు మార్చాలని నిర్ణయించారు.
పార్లమెంట్ భవనం తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అసెంబ్లీ, మండలి ఒకే చోట ఉండాలని యోచిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ సెషన్ నాటికి పూర్తిగా మార్పులు జరగాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ, మండలి ఒకే బిట్లా కనిపించేలా మార్పులు చేయాలని సూచించారు.
పార్లమెంట్ తరహాలో ఉండాలని నిర్దేశించారు. పార్లమెంట్ వద్ద విజయ్ చౌక్ మాదిరిగా ఉండాలని స్పష్టం చేశారు.
అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం. రైల్వే గేట్కు అనుకుని ఉన్న ప్రహారీ గోడ ఎత్తు పెంచాలని సూచించారు. మెంబర్స్ ఉదయం పూట వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు.
తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చేశారు. అక్కడ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. మరోవైపు శాంతి భద్రతలపైనా దృష్టిపెట్టారు. హైదరాబాద్, సైబరాబాద్ , రాచకొండ కమిషనరేట్స్ కు కొత్త సీపీలను నియమించారు. మరోవైపు డ్రగ్స్ ను కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారంలోపే చకచకా నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ ను రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు.