Praja Bhavan
Praja Bhavan : జ్యోతిబా పూలే ప్రజా భవన్ ను ఇక డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రజా దర్బార్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
రాజరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులతో తొలగించారు. ప్రగతి భవన్ పేరును జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా మర్చారు. ప్రజా భవన్ ను ప్రజా సమస్యలు తీర్చే నిలయం తీర్చిదిద్దారు. అందులో భాగంగానే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు డిప్యూటీ సీఎం అధికారిక నివాసాన్ని ప్రజా భవన్ లోనే కేటాయించారు.
అయితే ముఖ్యమంత్రి నివాసం కోసం ఎంసీఆర్ హెచ్ ఆర్డీ భవనంలో ఉండేందుకు సకల సదుపాయాలు ఉన్నాయి. భద్రతాపరంగా అనుకూలంగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీనిని ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది. ఎంసీఆర్ హెచ్ ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్ కు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.