KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వారంరోజులు కూడా కాలేదు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రెండురోజులకే రైతు బంధు నిధులు ఇంకా జమ చేయలేందంటూ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కేటీఆర్ మరో అడుగు ముందుకేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు సాధ్యంకాదని తేల్చేశారు.
సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దులపై చర్చ జరగలేదన్నారు. ఏటా కాగ్ నివేదికలు ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నారన్నారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పాలనలో ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి కాంగ్రెస్కు ఇచ్చారని చెప్తారని పేర్కొన్నారు.