Madya Pradesh CM
Madhya Pradesh: మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతో సహా పలువురు కీలక బీజేపీ నేతలు హాజరయ్యారు. భూపాల్ లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో మధ్య ప్రదేశ్ గవర్నర్ మంగుబాయి పటేల్ మోహన్ యాదవ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం రాజేంద్ర శుక్లా, జగదీశ్ దేవ్ రా ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ దామియా, మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తదితరులు హాజరయ్యారు.
చాయ్వాలా కుమారుడు.. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై..!
మోహన్ యాదవ్ తండ్రి పూనమ్చంద్ యాదవ్కు ఐదుగురు సంతానం. ఆయన మార్చి 25, 1965న ఉజ్జయినిలో జన్మించారు. వీరిలో మోహన్ చిన్నవాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. పూనమ్చంద్కు మాలిపురలో ఓ చిన్నపాటి చాయ్ దుకాణం ఉండేది. ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్నప్పటికీ అందర్నీ చదివించినట్లు మోహన్ యాదవ్ కుమార్తె డా.ఆకాంక్ష మీడియాకు తెలిపారు. ఇలా సామాన్య కుటుంబ నేపథ్యమున్న తమ తండ్రిని బీజేపీ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
ఒక చాయ్ వాలా కుమారుడు విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మోహన్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు 16 ఏళ్లకు పైగా పాలించిన శివరాజ్ సింగ్ చౌహాన్ను తప్పిస్తూ.. ఓబీసీ నేత మోహన్ యాదవ్ను నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన యాదవ్.. విద్యార్థి నేతగా ఎదిగి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టే స్థాయికి చేరుకున్నారు.
ఆరెస్సెస్తో సత్సంబంధాలున్న మోహన్ హిందుత్వ వాది. 1991లో ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఎంపికయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా పని చేస్తూ యువ మోర్చాలో పలు కీలక పదవులు చేశారు. 2004 నుంచి 2010 వరకు ఉజ్జయిని డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా కొనసాగారు. 2011 నుంచి 13 వరకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు.
2008లో మద్యప్రదేశ్ లో భాజాపా ప్రభుత్వంపై మీడియా ఆలోచన ధోరణి అనే ధీసస్ తో పీహెచ్ డీని పూర్తి చేశారు. రాష్ట్ర రెజ్లింగ్, ఒలింపిక్ అసోసియేషన్లలోనూ మోహన్ యాదవ్ చురుకుగా వ్యవహరించేవారు. కర్రసాము, కత్తి విన్యాసాల్లోనూ సిద్ధహస్తుడు. 2013లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికల్లో నెగ్గి, మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2020లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాజా ఎన్నికల్లో మూడవ సారి ఉజ్జయిని నుంచి విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.