ఏడుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామంలోని బి.సి గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. బయట నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని రెండు రోజుల పాటు దాచుకుని తినడం వలన వాంతులు, విరోచనాలు అవ్వడంతో అస్వస్థతకు గురయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ప్రిన్సిపల్ ముందుగా విద్యార్థులను స్థానిక ఎఎన్ఎమ్ కు చూపించారు. తర్వాత అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. సంఘటనపై విద్యార్థులను, పాఠశాల ప్రిన్సిపాల్ను, తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురవడం చాలా బాధాకరమని అన్నారు. గురుకుల పాఠశాల పరిసరాలను పరిశీలించానని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో చర్చించానని అన్నారు. సంఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోరానన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు డా. శ్రీకాంత్ విద్యార్థులను పరామర్శించారు. సమనస గురుకుల పాఠశాలలో జరిగిన విద్యార్థుల అస్వస్థత విషయంపై వస్తున్న వార్తలు అవాస్తవమని డా. శ్రీకాంత్ అన్నారు. తండ్రి విశ్వరూప్.. హాస్టల్లో ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకోమని కోరారని.. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా చూడాలని చెప్పారన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నానని పేర్కొన్నారు.
వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.