CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో అధికార పగ్గాలు చేపట్టిందే మొదలు వరుస సమీక్షలతో పాలనపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్రెడ్డి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్పై దృష్టి సారించిన ఆయన మూసీ నది ప్రక్షాళనకు పూనుకున్నారు. దుర్గంధంతో కంపు కొట్టే మూసీ ప్రాంతాన్ని సుందరీకరించి దాని రూపు రేఖలను మార్చాలనే యోచనలో భాగంగా అధికారులకు పలు ఆదేశాలు చేశారు.
వరుస సమీక్షలతో బిజీ అయిన సీఎం.. గ్రేటర్ హైదరాబాద్పై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులతోపాటు ప్రతిపక్ష పార్టీ అయిన ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా భాగ్యనగర అభివృద్ధితోపాటు మూసీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. నగరంలో నది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
పర్యాటకులను ఆకర్షించే విధంగా స్వీయ ఆర్థిక చోదక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందుకు గానూ.. మూసీ నదీ వెంట బ్రిడ్జిలు, కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్సులు, అమ్యూజ్మెంట్ పార్కులు, హాకర్ జోన్లు, పాత్-వేలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు రేవంత్. మూసీలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు ఎప్పటికి తగు నీటి మట్టం ఉండేలా చెక్ డ్యాంలు కూడా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.