Repalle : సమన్వయకర్తల మార్పు అంశం వైసీపీలో కాక రేపుతోంది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త మార్పు రాజకీయాన్ని వేడెక్కించింది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ ఇన్నాళ్లూ వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఈపూరు గణేశ్ కు వైసీపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయాన్ని వైసీపీ స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తోంది. మోపిదేవికే రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 150 మంది వైసీపీకి రాజీనామా చేసి సంచలనం రేపారు.
మోపిదేవి వెంకట రమణ వైసీపీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. అలాంటి నేతను పక్కన పెట్టి ఈపూరు గణేశ్ను సమన్వయకర్తగా నియమించడం తగదంటున్నారు. రేపల్లె వైసీపీ కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశం జరిగింది. మోపిదేవికి మద్దతుగా 150 మంది నేతలు రాజీనామాలు సమర్పించారు. సమన్వయకర్త మార్పు నిర్ణయాన్ని వైసీపీ అధిష్ఠానం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లు వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాలకు చెందిన కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ఆలోచనలో ఉన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని గతంలో మాట ఇచ్చిన నేతల విషయంలో పునరాలోచనలో పడ్డారు. అందుకే నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చే ప్రక్రియ చేపట్టారు. దీంతో ఇన్నాళ్లు ఆ పదవిలో ఉన్న నేతలు అలుగుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు గాజువాకలోనూ ఇదే పరిస్థితి తలెత్తినా వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగి.. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్ రెడ్డిని సముదాయించారు. కానీ చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు మరింత పెరుగుతున్నాయి. సమన్వయకర్తల మార్పు అంశం వైసీపీలో చిచ్చురేపుతోంది. అయినా సరే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది.