IPL 2024 Auction : ఐపీఎల్ 2024 వేలానికి ముహూర్తం దగ్గర పడుతోంది. అప్పుడే అందరినోటా ఎవరెవరికి ఎక్కువ ధర పలకనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 19న దుబాయిలో వేలం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ఫ్రాంచైజీల నుంచి 77 ఖాళీలు ఉండగా, 333 మంది ప్లేయర్లు ఐపీఎల్ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నారు. వీరిలో 214 మంది భారతీయులు ఉండగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ప్రతి జట్టులో 25 మంది ప్లేయర్లకు మించి ఉండకూడదనే నిబంధన ఉంది. వీరిలో 8 మంది మాత్రమే విదేశీ ఆటగాళ్లకు చోటు ఉంది. ఎందుకంటే మనోళ్ల సంగతి తెలిసిందే కదా…అవకాశమిస్తే ఇండియన్స్ ని పక్కనపెట్టి వాళ్లనే తీసుకుంటారు. అప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుపోయి, నాన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయిపోతుంది.
ప్రస్తుతం అయితే కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో 12 ఖాళీలు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లో 9 ఖాళీలు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ ప్రతీ జట్టులో 8 ఖాళీలు ఉన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, జట్లలో ఆరు చొప్పున ఖాళీలు ఉన్నాయి.
రూ.2 కోట్ల కనీస ధరతో 23 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వీరిలో భారత ఆటగాళ్లు అయితే ఉమేశ్ యాదవ్, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. ఇక మిగిలిన 20 మంది విదేశీ ప్లేయర్లే. వారిలో ట్రావిస్ హెడ్, రోసొవ్, హ్యారీ బ్రూక్, జోష్ ఇంగ్లిష్, ఫెర్గూసన్, స్టీవ్ స్మిత్, క్రిస్ వోక్స్, హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్, జేమ్స్ విన్సే, అబాట్, ముజీబ్ రెహ్మన్, కొయెట్జీ, కమిన్స్, అదిల్ రషీద్, డసెన్, ఓవర్టన్, డకెట్, ముస్తాఫిజుర్, డేవిడ్ విల్లీ ఉన్నారు.
1.5 కోట్ల కనీస ధరలో 13 మంది ప్లేయర్లు రంగంలో ఉన్నారు. వీరందరూ విదేశీ ఆటగాళ్లే కావడం విశేషం. మన భారతీయులెవరూ కూడా ఇందులోకి రాలేదు. అలాగే న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర రూ.50 లక్షల కనీస ధరతో ఉన్నాడు. తన కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీలు పడే అవకాశం ఉందని అంటున్నారు.