Uttam Kumar Reddy : గత పాలకుల వైఫల్యం వల్లే పౌరసరఫరాల శాఖ రూ. 56 వేల కోట్ల నష్టాల్లో ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో సివిల్ సప్లై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యం వల్లే పౌరసరఫరాల శాఖలో తప్పిదాలు జరిగాయన్నారు.
పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరో వంద రోజుల్లో రూ. 500కే గ్యాస్ సిలిండర్ ను అందజేస్తామని మంత్రి తెలిపారు. గత పాలకుల వైఫల్యం వల్ల పౌరసరఫరాల శాఖ ఆర్థిక పరిస్థతి ఆందోళనకరంగా ఉందన్నారు. 12 శాతం మంది వినియోగదారులు రేషన్ కార్డులు ఉపయోగించలేదని పేర్కొన్నారు. ప్రజలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వారు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది అధికారులు గమనించాలన్నారు. అవి పేదలు తినకపోతే ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందన్నారు. మొక్కుబడిగా బియ్యం పంపిణీ కాకుండా.. లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలన్నారు.
రేషన్ బియ్యాన్ని వినియోగదారులు వినియోగించుకోకపోవడం వల్ల కొందరు దళారులు బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనిని తక్షణమే అరికట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలన్నారు. మిల్లర్ల సమస్యలపై అధికారులతో చర్చించానని తెలిపారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రజలకు అవినీతిలేని.. పారదర్శకమైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు. వరికి రూ.500 బోనస్ ను మరో 100 రోజుల్లో అమలు చేస్తామని మంత్రి తెలిపారు.