Adivi Sesh : హీరో గానే కాక రైటర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్.. ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత వరుస క్రేజీ ప్రాజెక్టులతో రెడీ అవుతున్నాడు. వచ్చే సంవత్సరం ఏకంగా అడవి శేష్ మూడు సినిమాలు చేయబోతున్నట్లు టాక్. ఇప్పటికే సూపర్ హిట్ అయిన గూడచారి మూవీకి సీక్వెల్ మొదలు చేయగా.. ఇప్పుడు మరొక కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది.
ఈసారి అతని పక్కన హీరోయిన్ ఎవరో తెలుసా.. శృతిహాసన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డైరెక్షన్లో వస్తున్న కొత్త సినిమాలో అడవి శేష్ తో శృతిహాసన్ జతకట్టనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర బృందం ఇంతకముందే విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో.. ఈ మూవీకి నిర్మాతగా సుప్రియ యార్లగడ్డ వ్యవహరిస్తున్నారు. ఈమెతో పాటు మరో ప్రముఖ నిర్మాత మూవీ నిర్మాణంలో భాగస్వామిగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అడవి శేష్ చిత్రాలలో హీరోయిన్లు మిడ్రేంజ్ వాళ్లే ఉండేవారు.. మరి ఇప్పుడు స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ మూవీ లో హీరోయిన్ కావడంతో చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ మూవీకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ వర్క్ అడివి శేష్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు అతను రాసిన కథలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో అతని నెక్స్ట్ స్క్రిప్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇంతకుముందు చాలా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన షానీల్ డియోకు మంచి గుర్తింపు ఉంది. మరి దర్శకుడుగా అతని తొలి చిత్రంను ఎటువంటి పర్ఫామెన్స్ ఇస్తాడో చూడాలి.
ఇన్నాళ్లుగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను బాగా మెప్పించిన అడివి శేష్ ఈ సారి కంప్లీట్ లవ్ జోనర్ లో రాబోతున్నాడని టాక్. మరి ఈ మూవీ తో ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో మిగిలిన నటులకు సంబంధించిన డీటెయిల్స్ త్వరలోనే తెలుస్తాయి. ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ లో శృతిహాసన్ తో కలిసి పాల్గొన్న అడవి శేష్ ఆ ఫోటోలను షేర్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి.