Mahabubabad : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కావడంతో వ్యవసాయ జాతర నెలకొంది. జిల్లాలోని రైతులు బావులు, బోర్లు, చెరువుల కింద ఖరీఫ్ సాగు చేసిన భూముల్లో వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 40 శాతం పూర్తి అయ్యాయని రైతులు తెలిపారు. అయితే వర్షాల కారణంగా వరికోత పనులను మందకొడిగా సాగుతున్నాయని పేర్కొన్నారు. మరో 10 రోజుల్లో కోతలు పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు. వర్షాలకు వరి చేలు కుళ్లడంతో చెడువానలు వస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు కూలీలు రావడంలేదు. కూలీలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
రైతులు దిక్కుదోచ లేని స్థితిలో యంత్రాలను ఉపయోగించి వర కోతలు కోస్తున్నారు. వాటిని వినియోగించకపోతే ధాన్యం మార్కెట్కు చేరే పరిస్థితి ఉండదని తెలిపారు. కూలీల కోసం ఎదురుచూస్తే అకాల వర్షాలు సంభవిస్తే చేతికొచ్చిన పంటలు నేలపాలవక తప్పదంటున్నారు. ఆరుగాలం కష్టించే రైతులు ఒకవైపు పంటలకు తెగుళ్లు, మరోవైపు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరి పంటకు ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు వరకు ఖర్చు చేశామని రైతులు తెలిపారు. ఎకరానికి 25 నుంచి 30 బస్తాల ధాన్యం దిగుబడి రావడంతో లబోదిబో మంటున్నారు. ఎకరానికి 40 నుంచి 45 బస్తాల వరకు దిగుబడి వస్తుందని భావించిన రైతులకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. వచ్చిన దిగుబడి పెట్టిన పెట్టుబడికి కూడా సరిపోదని రైతులు అంటున్నారు. యంత్రాలతో కోసిన ధాన్యం కల్లాల్లో ఆరబెట్టారు. ఇంతలోనే ప్రకృతి కన్నెర్ర చేసింది. అకాల వర్షాలకు అరబోసిన ధాన్యం నిల్వలు తడిసి ముద్దాయి. మొక్కలు రావడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
గతంలో కూలీలు దండిగా ఉన్నప్పుడు వారితోనే వరి పంటను కొసేవారు. ఇప్పుడు కూలీల కొరత ఉండటంకో డబ్బులు ఎక్కువైనా యంత్రాలతోనే పని పూర్తి చేస్తున్నారు. వరి కోసే యంత్రాలకు గంటకు రూ. 3,500 రూపాయలు తీసుకుంటున్నారని రైతులు తెలిపారు.