2011 వరల్డ్ కప్ లో గౌతమ్ గంభీర్ ఓపెనర్ గా వెళ్లి 97 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు అవుట్ అయిపోయాడు. అదే రోజు మరో మూడు పరుగులు చేసి, సెంచరీ చేసి ఉంటే తనకి కూడా తగిన గుర్తింపు లభించేది. ఎందుకంటే ఎంతో బాధ్యతగా ఆడాల్సిన ఫైనల్ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ డక్ అవుట్ కావడం, సచిన్ టెండుల్కర్ 18 పరుగులే చేయడంతో మొత్తం బాధ్యతనంతా గంభీర్ మోశాడు.
ఎక్కడా తొణక్కుండా, బెణక్కుండా చాలా పట్టుదలగా ఆడాడు. ఆఖరికి ఒక రనౌట్ విషయంలో క్రీజులో బ్యాట్ పెడుతూ పడిపోయాడు, షర్ట్ అంతా మట్టి మట్టి అయిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణం పెట్టి ఆడాడు.
ఇక తన సంగతి పక్కన పెడితే అసలు 2011 వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు యువరాజ్ కి దక్కింది. 15 వికెట్లతో పాటు 362 పరుగులు చేశాడు. ఈ రెండు అంశాలని ఎవరూ పట్టించుకోలేదని, ఆఖరున ధోనీ కొట్టిన సిక్సర్ కే విలువ ఇచ్చారని గంభీర్ మళ్లీ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
దీనంతటికి కారణం నాకు, యువీకి సరైన పీఆర్ ఏజెన్సీ లేదని అన్నాడు. నిజానికి సచిన్ కి ఆఖరి మ్యాచ్ అది, అయినా సరే, తనకి కూడా అంత గుర్తింపు రాలేదని చెప్పి బాధపడ్డాడు. మీడియా కూడా ఫోకస్ అంతా ధోనీపైనే చూపించడం విచారకరమని అన్నాడు. ఈ రోజున మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అయిన యూవీ గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు? అని అన్నాడు.
ముఖ్యంగా లోపం ప్రజల్లో కూడా ఉందని తెగేసి చెప్పాడు. అసలైన ఆటగాళ్లకు విలువ ఇవ్వరు. వారి ప్రదర్శనను పట్టించుకోరు. ప్రశంసించరని ఆవేదన వ్యక్తం చేశాడు. మీడియా ఎప్పుడూ ఒకరి వెనకే పడకూడదని అన్నాడు. మీడియానే గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారని వాపోయాడు.
బ్రాడ్కాస్ట్ ఛానల్స్, కొన్నీ టీవీ షోలు.. సెలెక్టెడ్ ప్లేయర్లను మాత్రమే హైలైట్ చేస్తున్నాయి. మీడియా ఫెయిర్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జట్టులోని ఆటగాళ్లందర్నీ గుర్తించాలి. అద్భుత ప్రదర్శన చూపిన ప్రతీ ఆటగాడి గురించి మాట్లాడాలి.’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.