Karnataka : ఓ యువకుడిపై కక్షకట్టి.. ఆయన తల్లిని దారుణంగా హింసించిన ఘటన కర్ణాటకలోని బెళగావి సమీప గ్రామంలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి (20), ఓ యువకుడు (24) కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటివలే యువతికి కటుంబ సభ్యులు మరో యువకుడితో వివాహ నిశ్చితార్థం జరిపించారు. దీంతో ప్రేమికులిద్దరూ కలిసి ఆదివారం రాత్రి ఇళ్ల నుంచి పారిపోయారు.
ఈ విషయం తెలిసిన వెంటనే యువతి కుటుంబ సభ్యులు, బంధువులు.. యువకుడి ఇంటిపై దాడి చేశారు.ఇంట్లోని వస్తువులను పగలగొట్టారు. వాళ్లు అక్కడ లేకపోవడంతో యువకుడి తల్లి (42) పట్ల అమానుషంగా ప్రవర్తించారు. యువకుడి తల్లిని వీధిలోకి ఈడ్చుకొచ్చారు. నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. వీధిలో ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా గాయపరిచారు. ఊళ్లో ఏ ఒక్కరూ వారిని అడ్డుకోలేదు.
సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని ఆమెను రక్షించారు. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్, పోలీస్ ఉన్నతాధికారులు బధితురాలిని పరామర్శించారు. అమెకు ధైర్యం చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి.. పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా పోలీసులను నియమించారు. బాధిత కుటుంబ సభ్యులను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కలిశారు. వారికి ధైర్యం చెప్పారు.
ఈ ఘటనపై రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఈ అమానవీయా ఘటన సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేసింది. ఇలాంటి చర్యలను మా ప్రభుత్వం సహించదు. మహిళపై ఈ నేరానికి పాల్పడిన పలువురు అరెస్టయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేయడం మా బాధ్యత” అని సీఎం పేర్కొన్నారు.