Iphone Parts Plant : చేసిన పాపం ఊరికే పోదంటారు. చైనాకు ఇది అతికినట్లు సరిపోతుంది. కరోనా విషయాన్ని దాచిపెట్టి ప్రపంచాన్ని నాశనం చేసింది. అదే ఇప్పుడు ఆ దేశానికి శాపంగా మారుతోంది. కరోనా కఠిన ఆంక్షల వల్ల చైనా కంపెనీలో ఉత్పాదకత పడిపోతోంది. ఫాక్స్ కాన్ కంపెనీ తయారు చేస్తున్న యాపిల్ ఐఫోన్ల ప్రొడక్షన్ 30 శాతం పడిపోవడం అందులో ఒకటి. దీంతో ఐఫోన్ల తయారీ కోసం యాపిల్ కంపెనీ భారత్ వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అవకాశాన్ని మన దేశంలోని దిగ్గజ కంపెనీల్లో ఒకటైన టాటా ఉపయోగించుకోనుంది. ఇప్పటికే తమిళనాడులోని హోసూర్ లో 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీలో ఐఫోన్ కేస్ లను తయారు చేస్తోంది. ఇక నుంచి ఐఫోన్ విడిభాగాలను తయారు చేయడానికి రెడీ అవుతోంది. బ్లూమ్ బర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇప్పటికే ఉన్న 10 వేల మంది ఉద్యోగులకు అదనంగా మరో 45 వేల మంది మహిళా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే 18 నెలల నుంచి 24 నెలల్లో ఈ రిక్రూట్ మెంట్ పూర్తి చేయనున్నారు. అంటే ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో 45 వేల మంది మహిళలకు టాటా ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు దక్కనున్నాయన్నమాట.
మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం 16 వేల చొప్పున వేతనం ఇస్తోంది. మిగతా మార్కెట్ తో పోల్చితే ఇది 40 శాతం ఎక్కువంటాయి ఇండస్ట్రీ వర్గాలు. వేతనంతోపాటు భోజనం, వసతి కూడా అక్కడే కల్పిస్తోంది. ఇక మహిళలకు విద్య, శిక్షణ కార్యక్రమాలపైనా టాటా కంపెనీ ఫోకస్ పెట్టింది. కొత్తగా నియమించుకునే ఉద్యోగుల్లో గిరిజనులకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.
మరోవైపు విస్ట్రాన్ కంపెనీతో కలిసి ఐఫోన్ల తయారీ కోసం ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చర్ ఫ్యాక్టరీని నెలకొల్పడానికి టాటా గ్రూప్ ప్రత్నిస్తోంది. ఈ ఒప్పందం కుదిరితే భారత్ లో ఐఫోన్ల తయారీ వేగవంతమవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు భారత్ లో ఐఫోన్ తయారు చేసే తొలి కంపెనీగా టాటా రికార్డులకు ఎక్కనుంది.