2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన సెమిఫైనల్స్ లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో భారీ మెజార్టీతో గెలిచి హిందీ బెల్ట్ లో సత్తా చాటింది. అయితే, గెలిచిన రాష్ట్రాల్లో సీఎం ఎంపిక అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా.. ఇంకా రాజస్థాన్ సీఎం ఎంపిక పూర్తి కాలేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సీఎంలను కూడా నిన్నే ప్రకటించారు. కానీ.. రాజస్థాన్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
అయితే.. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ అడుగులు వేస్తోంది. రాజస్థాన్లో సీఎం రేసులో వసుంధర రాజే, బాబా బాలక్నాథ్ పేర్లు బలంగా వినించాయి. కానీ.. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని బాబా బాలక్నాథ్ ప్రకటించేశారు. ఇక.. వసుంధర రాజే విషయానికి వస్తే.. అధిష్టానం ఆమెపై ఆసక్తిగా లేనట్టే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో కూడా ఆమెకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. దీంతో.. శివరాజ్ సింగ్ చౌహాన్, యడ్యూరప్ప జాబితాలోనే చేరిపోరని చర్చ జరుగుతోంది.
రాజ్యవర్ధన్ రాథోడ్, గజేంద్ర సింగ్ షెకావత్, దియా కుమారి, సీపీ జోషి పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అగ్రవర్ణాలకే ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజస్థాన్లో ఛత్తీస్గఢ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తారని కూడా చర్చ నడుస్తోంది. ఛత్తీస్గఢ్ హేమాహేమీలను పక్కన పెట్టి.. గిరిజన నేత విష్ణు దేవ్సాయిని అవకాశం కల్పించారు. రాజస్థాన్ లో కూడా ఇదే పంధాలో వెళ్లే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా.. గిరిజన ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. అందుకే.. గత కొంత కాలంగా బీజేపీ గిరిజనుల ఓట్లపై ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేసింది. ఛత్తీస్గఢ్లో గిరిజన నేతను సీఎంగా నియమించింది. రాజస్థాన్ లో కూడా ఇదే ఫార్ములా ఇంప్లిమెంట్ అవ్వచొచ్చని తెలుస్తోంది.
అయితే.. రాజస్థాన్లో జాట్ జనాభా అత్యధికంగా ఉన్నారు. కానీ.. ఆ కమ్యూనిటీ నుంచి ఒకరు కూడా ఇంత వరకు సీఎంగా చేయలేదు. అందుకే.. జాట్లలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈసారి కూడా జాట్ నేతను సీఎం చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. దీనికి మద్దతుగా ఒక హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో ఉంది. కేంద్ర నాయకత్వం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.