తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. గత రెండు, మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో జనాలు వణికిపోతున్నారు. ఉదయం వేళ పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలు దాటినా మంచు తగ్గడం లేదు. దీంతో బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. హైదరాబాద్లోనూ చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో నగర వాసులు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఆస్పత్రుల పాలవుతున్నారు.
ఇక తెలంగాణలో సాయంత్రం అయిందంటే చలి తీవ్రత పెరిగి.. చేతులు బిగుసుకుపోతున్నాయి. అడుగు బయటపెట్టాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటకు వెళ్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, మహబూబ్నగర్, నిజామాబాద్, కరీంనగర్ సహా పలు జిల్లాలో చలిగాలులు వీస్తూ.. దట్టంగా మంచు కురుస్తోంది. ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏజెన్సీ ఏరియాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. లంబసింగిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో దట్టంగా పొగ మంచు అలుముకుంటుండంతో.. దారి కనిపించడంలేదు. దీంతో ఘాట్ రోడ్లో వెళ్లే వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఎదురుగా ఏం ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇక కొందరైతే రోడ్లపై చలి మంటలు వేసుకుంటున్నారు.
ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి చలి గాలులు వీస్తుండటంతో.. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు వైద్యులు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.