Article 370 | జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు అని కొనియాడారు.
Article 370 | జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు అని కొనియాడారు. 2019 ఆగస్టు 5న పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమని గుర్తుచేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన తరువాత ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు.
“జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజల కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన వర్గాలకు ప్రయోజనం అందజేయాలి.. ప్రగతి ఫలాలను మీకు చేర్చాలని నిశ్చయించాం. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు కేవలం చట్టపరమైనది మాత్రమే కాదు ఇది జమ్మూ కశ్మీర్ ప్రజల భవిష్యత్ ఆశాకిరణం,” అని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఈ తీర్పుపై హర్షం వ్యక్తపరిచారు.
కాంగ్రెస్ పార్టీ :
కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ పార్టీ ప్రతినిధి ఎంపీ అధీర్ రంజన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే శాసన సభ ఎన్నికలు జరిపి.. తిరిగి జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలన్నారు. మరో కాంగ్రెస్ నాయకుడు ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ ప్రజలకు వెంటనే వారి ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించి.. కశ్మీర్కి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
ఎంఐఎం పార్టీ :
ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ” జమ్మూ కశ్మీర్లో కేంద్రం ఆర్టికల్ 370 రద్దుని సుప్రీం కోర్టు సమర్థిచింది. ఈ తీర్పుని నేను ఆశించలేదు. చాలా నిరాశగా ఉంది,” అని అన్నారు.
శివసేన పార్టీ :
శివసేన పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ” జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో మేము కూడా భాగస్వాములం. సుప్రీం కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం,” అని చెప్పారు.
జమ్మూ కశ్మీర్ నేతలు
మెహబూబా ముఫ్తీ
“కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆర్టికల్ 370 రద్దుని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఇది కశ్మీర్కే కాదు.. మొత్తం భారత దేశానికే మరణ శిక్ష లాంటిదని,” పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఘూటుగా స్పందించారు.
ఒమర్ అబ్దుల్లా
“సుప్రీం కోర్టు తీర్పు నిరాశజనకంగా ఉంది. అయినా మేము ధైర్యం కోల్పోలేదు. ఒక సుదీర్ఘ పోరాటం కోసం సన్నధమవుతున్నాం,” అని నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
గులాం నబి ఆజాద్
“నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాను. సుప్రీం కోర్టులో అయినా న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురుచూశాను. కానీ ఈ తీర్పుతో చాలా నిరాశ కలిగింది. నెలల పాటు విచారణ తరువాత కోర్టు ఇలాంటి తీర్పునిస్తుందని నేను ఊహించలేదు. జమ్మూకశ్మీర్ ప్రజలు ఈ తీర్పు పట్ల సంతోషంగా లేరు,” అని డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు.