తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్నారు. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి.. ఆయనకు సాధరంగా ఆహ్వానం పలికి ఇంద్రకీలాద్రిపై అమ్మ వారి దర్శనం చేయించారు. ఈ క్రమంలోనే ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి పొంగులేటికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి అర్చకులు ఆశీర్వాదాలతో పాటు తీర్ధప్రసాదాలను అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొక్కు చెల్లించుకోవడానికి వచ్చానని పొంగులేటి చెప్పారు. 10ఏళ్లలో అభివృద్ధి పేరుతో కేసీఆర్.. 5లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6గ్యారెంటీ హామీలను అమలు చేస్తుందని తెలిపారు. నాకు సీఎం జగన్ కు మధ్య వ్యక్తిగత సంబందాలు వేరు.. రాజకీయ సంబంధాలు వేరని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో విభజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పొంగులేటి వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రతి సమస్యను….అన్నదమ్ముల మాదిరి సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇక వీరితో పాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రుద్రరాజు, ఏపీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా 2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో పొంగులేటి వైసీపీ తరఫున.. ఖమ్మం లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొని.. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.