Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీకోట మండలం పలమనేరులో గత వారం రోజులుగా ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. కృష్ణాపురం, మోట్లపల్లి, గోనుమాకులపల్లి, తెట్టుబండపల్లి గ్రామాలలో 13 ఏనుగులు పంటలపై స్వైర విహారం చేస్తున్నాయి. ఏనుగుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎప్పుడు.. ఎటువైపు నుంచి.. వచ్చి ఏనుగులు దాడి చేస్తాయో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఏనుగులు స్వైర విహారం చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు ఏమి చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఏనుగుల దాడిలో లక్షల్లో పంటలను నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంటలను మాత్రమే నాశనం చేసిన ఏనుగులు.. ప్రజలపై దాడి చేయకముందే అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.