CM Camp Office : ప్రగతిభవన్ ప్రజాభవన్ అయింది. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసం ఎక్కడ. ఇప్పుడిదే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. రేవంత్ రెడ్డి తన సొంత ఇంటి నుంచే పాలనను సాగిస్తారా అన్న చర్చకు అయితే పుల్ స్టాప్ పడినట్టుగా తెలుస్తోంది. అందుకు కారణం రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీకి వెళ్లడమే.
పరిపాలనపై ఫుల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రోజు సమీక్షలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అందులోభాగంగా తన క్యాంపు ఆఫీస్ను మార్చే యోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. జూబ్లీహిల్స్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని తన క్యాంపు కార్యాలయంగా ఎంచుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం తన ఇల్లు జూబ్లీహిల్స్ లో ఉంది. అయితే రద్దీ ప్రదేశం కావడంతో స్థానికులకు, తన ఇంటికి వచ్చేవారికి ఇబ్బంది అవుతుందని సీఎం గుర్తించారు. అందుకే ఎంసీహెచ్ఆర్డీని క్యాంపు కార్యాలయంగా మారుస్తారని టాక్ వినిపిస్తోంది.
మొత్తంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ప్రమాణస్వీకారం జరగకముందే ప్రగతి భవన్ ముందున్న కంచె తీసేసి తమది ప్రజా ప్రభుత్వం అని తేల్చిచెప్పారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా పేరు మార్చి సామాన్య ప్రజల సమస్యలను తెల్సుకోవడానికి ప్రజా దర్బార్ పెట్టారు. ఈ కార్యక్రమానికి ఊహించని విధంగా స్పందన వస్తోంది.