Kartheeka Masam : కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ఏపీలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఇందులో భాగంగానే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్త జనం.. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇచ్చారు. క్యూలెన్లో వేలాది మంది భక్తులు ఉండడంతో దర్శనానికి 8 గంటల సమయం పట్టే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇక ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రమైన ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానంలో ఈరోజు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతించారు. గోదావరి స్నానాలకు రాజమండ్రి పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ భక్తులు పోటెత్తారు .