Power Outage: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ద్వీపదేశం శ్రీలంకను ఇప్పుడు విద్యుత్ సంక్షోభం చుట్టుముట్టింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవహారాలను పర్యవేక్షిస్తోన్న సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
దేశంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సీఈబీ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాట్ మలే – బియగమా మధ్యనున్న ప్రధాన విద్యుత్ లైన్ లో తలెత్తిన సమస్య కారణంగానే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్నెట్ సేవలకు ఆంటంకం ఏర్పడింది.
కాగా.. లంకానగరం 2022 నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇంధనం, ఆహారపదార్థాలు, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. విదేశీ మారక నిల్వలు కూడా తక్కువ అవ్వడంతో ఇంధన రవాణాకు కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా లంకదేశంలో గణనీయంగా విద్యుత్ కోతలు జరుగుతున్నాయి. రోజుకు సుమారు 10 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తుండటం సర్వసాధారణమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. చీకట్లో ఉన్న శ్రీలంక దేశానికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.