Indian Temples : మనదేశంలో మహిళలకు ప్రవేశం లేని ఆలయాల గురించి మీరు వినే ఉంటారు. కానీ.. పురుషులకు ప్రవేశం లేని దేవాలయాలూ కొన్ని ఉన్నాయి. అంతేకాదు.. పురుషులు ఈ ఆలయాల్లో ప్రవేశించకుండా కొందరు కాపలాదారులూ ఆయా ఆలయాల్లో పనిచేస్తూ ఉంటారు. ఇంతకూ ఆ దేవాలయాలు ఎక్కడున్నాయి? వాటి ప్రత్యేకతలేమిటో మనమూ తెలుసుకుందాం.
రాజస్థాన్లోని పుష్కర్ దేవాలయంలోకి పురుషులకు ప్రవేశం లేదు. నిజానికి ఇది బ్రహ్మ దేవుని ఆలయం. రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మ దేవాలయం ఉంది. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ గర్భ గుడిలోకి వివాహితులైన పరుషులకు ప్రవేశం లేదు. బ్రహ్మ దేవుడు పుష్కర సరస్సు దగ్గర యజ్ఞం చేయాలని తలపెట్టగా.. సరస్వతీ దేవీ ఆలస్యంగా వచ్చిందట. దీంతో బ్రహ్మదేవుడు.. గాయత్రిని వివాహమాడి ఆ క్రతువును పూర్తి చేశాడట. ఈ విషయం తెలిసి మండిపడిన సరస్వతీ దేవి.. ఈ యాగం జరిగిన పరిసరాల్లో పురుషులకు ఇకపై స్థానం ఉండదని, పొరబాటునైనా ఇక్కడ పురుషులు అడుగుపెడితే.. వారి వైవాహిక జీవితంలో సమస్యలు తప్పవని శపించింది. నాడు యాగం జరిగిన ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మితమైంది కనుక నేటికీ అక్కడ పురుషులకు ప్రవేశం లేకుండా పోయింది.
అసోంలోని గువాహటిలోని నీలాచల్ పర్వతంపైన కామరూప కామాఖ్య ఆలయం ఉంది. నిజానికి ఇది.. అనేక ఉపాలయాల సమాహారం. ఇందులో కాళి, తార, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధుమావతి, బగళాముఖి, మాతంగి వంటి దేవతల ఆలయాలున్నాయి. దక్షయజ్ఞ వాటికలో దూకి ఆత్మాహుతికి పాల్పడిన సతీదేవి శరీరాన్ని మహోగ్రరూపంతో భుజానవేసుకుని తాండవం చేయగా, ఆ సమయంలో ఆమె యోని భాగం పడిన ప్రదేశమే నేటి కామాఖ్య దేవాలయం. మిగతా రోజుల్లో పురుషులూ ఈ ఆలయంలో ప్రవేశించొచ్చు గానీ.. నెలలో మూడు రోజుల్లో మాత్రం పురుషులకు ప్రవేశం ఉండదు. ఇది అమ్మవారి రుతుచక్ర సమయం అని చెబుతారు. ఈ సమయంలో మహిళలే అమ్మవారి పూజలు చేస్తారు. దేశంలోని 18 శక్తి పీఠాల్లో ఇదొకటి.
శివ పార్వతులు కొత్తగా పెళ్ళైన తర్వాత ఇక్కడికి సమయంలో కేరళలోని చెంగన్నూరుకు విహారయాత్రకు వచ్చారనీ, సరిగ్గా అక్కడికి రాగానే అమ్మవారు రజస్వల అయ్యారని ఇక్కడి స్థలపురాణ గాథ చెబుతోంది. అందుకే నెలలో మూడు రోజులు ఆలయంలోకి పురుషులను అనుమతించరు. ఈ మూడురోజుల్లో అమ్మవారిపై కప్పిన వస్త్రం కూడా ఎర్రగా మారుతుందట. ఈ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోనికి అనుమతిస్తారు. నాలుగోరోజు మహిళలు ఏకాంతంగా అమ్మవారి విగ్రహానికి పవిత్ర జలంతో అభిషేకం చేశాకే.. పురుష పూజారులు.. పూజాదికాలు నిర్వహిస్తారు.
కేరళలోని అట్టుకల్ భగవతి ఆలయంలోనూ మహిళలదే ఆధిపత్యం. పార్వతీదేవి ఇక్కడ భగవతి పేరుతో పూజలందుకుంటుంది. ఏటా ఇక్కడ జరిగే పొంగల పండగ వేడుకల్లో లక్షలాది మహిళలు పాల్గొంటారు. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన ఈ వేడుక.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పది రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి గాజులు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయపు పొంగల్ వేడుకల్లో లక్షలమంది మహిళలు పాల్గొన్నా.. ఆ సమూహంలో ఒక్క పురుషుడూ కనిపించడు. అలా పాల్గొంటే పాపం చుట్టుకుంటుందని వారి నమ్మకం.
కేరళలోని అలెప్పిలోని చక్కులథుకవు ఆలయం ఉంది. దుర్గాదేవి కొలువై ఉండే ఈ ఆలయంలో ఏటా డిసెంబర్ తొలి శుక్రవారం రోజు ‘ధను’ పేరిట జరిగే నారీపూజలో పురోహితుడు… పది రోజులపాటు ఉపవాస దీక్ష చేసిన మహిళల పాదాలను కడుగుతాడు. ఈ సమయంలో ఆలయంలో పురుషులకు అనుమతి ఉండదు.
ఇవిగాక.. బీహార్లోని ముజఫర్ పూర్ పట్టణంలోని అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక సమయంలో పురుషులకు ప్రవేశం ఉండదు.