Files Robbery: తెలంగాణలో మాజీ మంత్రుల కార్యాలయాల్లో ఫైల్స్ చోరీ కలకలం రేపుతోంది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే.. ఫైల్స్ మాయవవుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ఆఫీస్ల నుంచి ఫైల్స్ చోరీ అవడం వెనుక బీఆర్ఎస్ కు్ట్ర ఉందని.. వారి అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వేళ సెక్రటేరియట్లో ఫైల్లు మాయవుతున్నాయన్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ మూడవ అంతస్తులోని కార్యాలయంలో ఫైల్స్ చోరీకి గురయ్యారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. అలాగే అంతకుముందు మాజీ పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ ఆఫీస్లలోనూ ఫైల్స్ మాయమయ్యాయి. దీంతో రెండు ఘటనలపై కూడా కేసులు నమోదుకావడంతో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆటోల్లో వచ్చి ఫైల్స్ మాయం చేసింది ఎవరు..? ఈ ఘటనల వెనుకు ఉన్నదెవరనే కోణంలో కూపీలాగుతున్నారు. ఇదంతా బీఆర్ఎస్ నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నమేనన్న టాక్ నడుస్తోంది.
ఎన్నికలకు ముందు రేవంత్ నోటా ప్రతీ రోజు గులాబీ నేతల అవినీతి అంతుచూస్తానంటూ మాట్లాడారు. కేసీఆర్ ఫ్యామిలీకైతే చంచల్గూడలో డబుల్బెడ్ రూం కట్టిస్తానని ప్రచారం సాగించారు. పార్టీ అగ్రనేతలైన రాహుల్, ప్రియాంకతోసహా.. ప్రచారానికి వచ్చిన అగ్రనేతలంతా ఇదే మాట మాట్లాడారు. తాము ఊహించినట్టే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గులాబీ నేతల గుండెల్లో గుబుల మొదలైందని.. వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తమ కార్యాలయాల్లో ఫైల్లను మాయం చేస్తున్నారని ఆరోపిస్తోంది హస్తం గ్యాంగ్.ఈ మేరకు కాంగ్రెస్ నేత నిరంజన్ డీజీపీ రవిగుప్తాకు లేఖ రాశారు. ఫైల్స్ చోరీ ఘటనపై పటిష్ట దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే దస్త్రాలను మాయం చేస్తున్నారని ఫిర్యాదు చేశారాయన. ప్రభుత్వ కార్యాలయాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని లేఖలో కోరారు.