Moonlighting : ఐటీ కంపెనీల్లో ఇటీవల తీవ్ర దుమారం రేపిన అంశం… మూన్ లైటింగ్. ఒక కంపెనీలో పనిచేసే టెక్కీ… యాజమాన్యానికి తెలీకుండా మరో సంస్థలోనూ ఇంటి నుంచి పనిచేస్తున్నారని బయటపడటంతో… దిగ్గజ కంపెనీలన్నీ ఉలిక్కిపడ్డాయి. మూన్ లైటింగ్ ను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ… ఉద్యోగుల తొలగింపును కూడా చేపట్టాయి. కానీ… దీనికి పూర్తి భిన్నంగా టెక్ మహీంద్రా చేసిన ప్రకటన… మూన్ లైటింగ్ సమస్యకు ఓ పరిష్కారం కనిపెట్టే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయా? అనే చర్చకు దారితీసింది.
సంస్థ ఉద్యోగులు అదనపు పనులు చేసుకునేందుకు తమకు అభ్యంతరమేమీ లేదని టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ అన్నారు. ఖాళీ సమయాల్లో ఎంప్లాయిస్ ఇతర పనులు చేసుకునేందుకు అనుమతించేలా… మూన్లైటింగ్ విధానాన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే, ఇందుకు కొన్ని షరతులు ఉండొచ్చని గుర్నానీ సంకేతాలిచ్చారు. కంపెనీ నిబంధనల్ని అనుసరిస్తూ… ఇతర ఉద్యోగాలు చేసుకోవడంలో తమకు అభ్యంతరమేమీ లేదంటున్నారాయన.
ప్రస్తుతం టెక్ మహీంద్రా 90 దేశాల్లో… ఆయా దేశాల కార్మిక చట్టాల్ని అనుసరించి కార్యకలాపాలు కొనసాగిస్తోందని గుర్నానీ చెప్పారు. తమ ఉద్యోగులకు రెండో సంపాదన ఉంటే తామూ సంతోషిస్తామని… అయితే, కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏం చేస్తున్నారనేది కంపెనీకి చెప్పి అనుమతి తీసుకుంటే సరిపోతుందన్నారు. అలా కాకుండా చేసే పని దాచిపెడితే… చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గుర్నానీ ప్రకటన ఇతర ఐటీ కంపెనీలను ఆశ్చర్యపరిస్తే… టెక్కీల్ని మాత్రం సంతోషంలో ముంచింది. ఓ కంపెనీలో పని చేస్తూ… ఖాళీ సమయంలో మరో సంస్థలో ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తే… అంతకన్నా కావాల్సిందేముందనేది టెక్కీల అభిప్రాయం.