Harish Rao : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి రెండు రోజులు కాకముందే.. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించడం పట్ల తీవ్ర విమర్శలు పాలవుతున్నారు. నిన్న మీడియాతో సమావేశం అయిన హరీష్ రావు.. రైతు బంధు నిధులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చి ఉన్నారని.. 9వ తేదీ అయినా ఇంకా డబ్బులు వేయలేదని అన్నారు. రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారని హరీష్ ప్రశ్నించారు.
తాము అధికారంలోకి వస్తే బోనస్ ఇచ్చి మరీ వడ్ల కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు రైతులు వడ్లను అమ్ముకునేందుకు ఎదురు చూస్తున్నారని.. ప్రభుత్వం ఈ విషయంలో రైతులకు ఇచ్చిన హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పారు. తుపాన్ కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిసాయని, వాళ్ళను కూడా ఆదుకోవాలని కోరారు.
అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల వరకు కూడా.. సంక్షేమ పథకాల అమలుకు సమయం తీసుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. పథకాల అమలు విషయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన… తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాటి అమలు విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే.. మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పెంపు పథకాలను అమలు లోకి తీసుకొచ్చి మాటంటే మాటే అనేలా నిరూపించుకున్నారు. కానీ హరీష్ రావు మాత్రం కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.